Tuesday, October 28, 2014

బ్రెజిల్ అధ్యక్ష పగ్గాలు మళ్లీ రౌసెఫ్‌కే

బ్రెజిల్ అధ్యక్ష పగ్గాలు మళ్లీ రౌసెఫ్‌కే
రియోడీ జెనీరో: బ్రెజిల్ అధ్యక్ష పగ్గాలు మరోసారి వామపక్ష మహిళా నేత, వర్కర్స్ పార్టీకి చెందిన దిల్మారౌసెఫ్‌కే దక్కాయి. ‘నువ్వా-నేనా’ అన్నట్లు పోటాపోటీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి ఏసియోనెవెస్‌పై రౌసెఫ్ విజయం సాధించారు. రౌసెఫ్‌కు 51.6 శాతం ఓట్లు లభించగా, ఏసియోనెవెస్ 48.4 శాతం ఓట్లు సాధించారు. బ్రెజిల్‌లో 2003 నుంచి వర్కర్స్ పార్టీ  అధికారంలో కొనసాగుతోంది.

ఈ కాలంలో అమలు చేసిన సామాజిక, సంక్షేమ కార్యక్రమాల చేయూతతో ఎందరో పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే, గత నాలుగేళ్లుగా ఆర్థిక రంగం తిరోగమనం బాటలో నడుస్తున్నా, దేశాన్ని తిరిగి ప్రగతి బాటన పరుగులెట్టిస్తానని నెవెస్ హామీలిచ్చినా... ఓటర్లు వరుసగా నాలుగోసారి వర్కర్స్ పార్టీకే పట్టం కట్టారు. కాగా, బ్రెజిల్ అధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికైన దిల్మారౌసెఫ్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఆమెతో కలసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆర్థిక రంగ పురోగమనానికి కృషి చేస్తా...
బ్రెజిల్ ఆర్థిక రంగాన్ని పురోగమనం వైపు తీసుకెళతానని, అవినీతిపై పోరాడతానని రౌసెఫ్ ప్రకటించారు. విజయం సాధించిన అనంతరం ఆదివారం ఆమె బ్రసీలియాలో మీడియాతో మాట్లాడారు.

No comments:

Post a Comment